Tuesday 26 November 2019

Agitation demanding Durable Roads, Storm Water Drainage, Foot paths etc.. on 25.11.2019











ప్రచురణార్ధం:                                                                                               తేదీ:25.11.2019

ఆధునిక టెక్నాలజీతో దీర్ఘకాలం మన్నే రోడ్లు నిర్మించాలని, నడవటానికి వీలుగా ఉండే ఫుట్‌ పాత్‌లను నిర్మించాలని, ఆధునిక టెక్నాలజీతో మాన్‌¬ల్స్‌ నిర్మించాలని మూతలు రోడ్డు లెవెల్‌కు బిగించాలని. ఫుట్‌ పాత్‌ అంచున(రోడ్డువైపు) స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లు నిర్మించాలని, వర్షపు నీరు డ్రైను లోకి పోవటానికి అక్కడక్కడ ఉక్కు జాలీలను బిగించి, మిగతా డ్రైన్‌ మొత్తం చెత్త పడకుండా సిమెంట్‌ బిళ్లలతో మూసి వేయాలని, ప్రస్తుతం ఉన్న స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లలో పూడికలు తీయాలని. నగరంలో విద్యుత్‌ వైర్లు అన్నీ అండర్‌ గ్రౌండ్‌కు మార్చాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌ వద్ద ఈ డిమాండ్లతో కూడిన ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. స్థానిక శాసనమండలి సభ్యులు కె.ఎస్‌.లక్ష్మణరావు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విజయవాడ నగరం రాజధాని ప్రాంతంగా ఉన్నప్పటికీ నగరంలోని మౌలిక సదుపాయాలు అందుకు తగినట్లుగా లేవని అన్నారు. విజయవాడ నగర సమస్యలపై జరిగే ఆంధోళనలకు పి.డి.ఎఫ్‌. ఎంఎల్‌సిలుగా తాము మద్దత్తునిస్తామని, ఈ సమస్యలను శాసనమండలిలో లేవనెత్తుతామని అన్నారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షలు వి. సాంబిరెడ్డి మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిందని, ఫుట్‌పాత్‌లు లేక పోవటంతో ప్రజలు రోడ్డు మీద వాహనాల మధ్య నడవవలసి వస్తుందని, ఇది చాల ప్రమాదకరమని అన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి యం.వి. ఆంజనేయులు మాట్లాడుతూ, నగరంలో రోడ్లు గోతుల మయంగా తయారయ్యాయని, వర్షంవస్తే జలాశయాలుగా మారుతున్నాయని అన్నారు.రోడ్డుమీద గోతులలో వాహనదారులు పడిపోయి ఆసుపత్రిపాలవుతున్నారని, వాహనాలు దెబ్బతింటున్నాయని అన్నారు మాన్‌ ¬ల్స్‌ పగిలిపోయి పొంగి డ్రైనేజి వాటర్‌ రోడ్లమీదకు వస్తున్నాయని, మాన్‌ ¬ల్స్‌ రోడ్డు లెవెల్లోలేకుండా ఎత్తుగానో పల్లంగానో ఉండి ప్రమాదకరంగా మారుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ వి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారయింది తగినన్ని పార్కింగ్‌ సౌకర్యాలు లేవని, రోడ్డు డిమార్కేషన్‌, సరైన సిగ్నలింగ్‌ వ్యవస్థ లేదని అన్నారు. మోతుకూరి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆధునిక పధ్ధతులలో ట్రాఫిక్‌ సౌకర్యాలు కల్పించకుండా పోలీసు యంత్రాంగం పెనాలిటీలు విధించటం సరికాదన్నారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ వి.ఎస్‌ రామరాజు, ఎ. భవానీ ప్రసాద్‌, యేసుబాబు, వి.సత్యన్నారాయణ, జె.వి.రెడ్డి, టి. వెంకటేశ్వర్లు, గుప్త, తదితరులు పాల్గొన్నారు.


(వి.సాంబిరెడ్డి)                    (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                   కార్యదర్శి


Memorandum Submitted to VMC Commissioner

                                                                                                   తేదీ:17.10.2019
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌గారికి,
ఆర్యా,
విషయం: విజయవాడ నగరంలో రోడ్ల స్థితిగతులు, ట్రాఫిక్‌ నియంత్రణకు కావలసిన మౌలిక సౌకర్యాల ఏర్పాటును కోరుతూ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సమర్పిస్తున్న మెమొరాండం.
విజయవాడ నగరంలోని రోడ్ల, స్థితిగతులు, ట్రాఫిక్‌, ఈ-చలానాల విధింపు అంశాలపై 28.09.2019న టాక్స్‌ పేయర్సు ఆధ్వర్యంలో విజయవాడ నగరపౌరుల సమావేశం జరిగింది. ఆసమావేశంలో వెల్లడైన అభిప్రాయాలు, చేసిన తీర్మానాల ఆధారంగా ఈ మెమురాండాన్ని మీకు సమర్పిస్తున్నాము. ఈ మొమురాండంలో మీకు సమస్యను వివరించడం వరకే పరిమితం కాకుండా పరిష్కారాలనుకూడా మీ ముందుంచుతున్నాము.
సమస్య-1 రోడ్లు

విజయవాడ నగరంలో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయి. ఎక్కడ చూచినా రోడ్లపై గోతులు, గుంటలు కనుపిస్తుంటాయి. చిన్నపాటి వర్షాలకు కూడా రోడ్లు తటాకాలుగా మారుతున్నాయి. వర్షపునీరు ఎప్పటికప్పుడు పోయే స్ధితి లేదు. నగరంలో స్టార్మ్‌వాటర్‌ డ్రైనేజివ్యవస్థ సక్రమంగా లేకపోవటమే దీనికి ప్రధాన కారణమని మేము భావిస్తున్నాము. రు.460 కోట్ల రూపాయలతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణం ప్రారంభంచినప్పటికీ, పాతడ్రైన్ల స్థానంలో క్రొత్తడ్రైన్లను నిర్మిస్తున్నారే తప్ప, అవి సమస్యను పరిష్కరించే విధంగా లేవు. ఇక రోడ్లమీద మాన్‌¬ల్స్‌ చాలా చోట్ల దెబ్బతిని ఉన్నాయి. వాటి ద్వారా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నీరు పెల్లుబుకి రోడ్డు మీదకు పొంగుతున్నది. దీనితో పరిసరాలలో అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మన నగరంలో మాన్‌హోల్స్‌కు లెవెలింగ్‌ లేదు. అవి నిర్మాణంలో తేడా కావచ్చు లేదా మూతలు పగిలి పోవటం వలన కావచ్చు. కొన్ని మాన్‌హోల్స్‌ రోడ్డు లెవెల్‌కు పైకి ఉంటాయి. కొన్ని మాన్‌¬ల్స్‌ రోడ్డు లెవెల్‌కు క్రిందకు ఉండి గోతులు లాగా మారుతున్నాయి. ఈ లెవెలింగ్‌ లేని మాన్‌హోల్స్‌ వలన వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వాహనదారులు ఈ లెవెలింగ్‌ లేని మాన్‌¬ల్స్‌ వలన పడిపోతున్నారు. వర్షపునీరు నిలిచినప్పుడు, లేదా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నీరు పెల్లుబుకి రోడ్డు మీదకు వచ్చినప్పుడు, అలాగే రాత్రివేళలలో మాన్‌¬ల్స్‌ కనుపించక వాహనదారులు పడిపోతున్నారు.
మన నగరంలో రోడ్లు వేసే పద్దతి, వాడుతున్న మెటీరియల్‌ కూడా సక్రమంగా లేకపోవటం మనరోడ్ల దుస్థితికి కారణాలని మేము భావిస్తున్నాము. రోడ్డు వేసిన అనంతరం కొద్ది రోజులకే రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ప్రపంచంలో మనకంటే అత్యధిక వర్షపాతం కలిగిన దేశాలలో, మనకంటే అత్యధిక ఎండలు కలిగిన దేశాలలో, మనకంటే అత్యధిక వాహనాలు కలిగిన దేశాలలో ధ్వంసం కాని రోడ్లు మన నగరంలో ధ్వంసం అవుతున్నాయి. రోడ్డువేసిన ఏడాదిలోపే ధ్వంసం అయిన సందర్భాలుకూడా ఉన్నాయి. రోడ్డు వేసి ఏడాదికూడా గడవకముందే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి కోసం త్రవ్విన సందర్భాలు ఉన్నాయి.
మన నగరంలో రోడ్లు వేసేపధ్ధతిలోనే కాదు, రోడ్లు రిపేరు చేసే పధ్ధతిలోకూడా తేడా ఉంది. ఏ అవసరానికైనా రోడ్డు త్రవ్వినప్పుడు దానిని వెంటనే పూడ్చటంలేదు. పూడ్చినా సక్రమంగా పూడ్చటంలేదు. పని సందర్భంలో కాకుండా, పని ప్రారంభానికి చాలాకాలం ముందు తవ్వటం, పని పూర్తయిన తర్వాత చాలా కాలం పూడ్చకుండా వదలి వేయటం, పూడ్చినప్పుడు కూడా రోడ్డు లెవెల్లో కాకుండా ఎగుడు దిగుడుగా పూడ్చటం జరుగుతున్నాయి. ఇవి కూడా నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి.
సమస్య-2 ట్రాఫిక్‌
విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోతున్నది. పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ట్రాఫిక్‌ నియంత్రణకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన మాత్రం జరగటంలేదు.
ఫుట్‌ పాత్‌లు:-పాదచారులు రోడ్డు మీదనే వాహనాల మధ్యలో నడవవలసి వస్తున్నది. ఫుట్‌ పాత్‌ సౌకర్యాలు లేవు. ఉన్న చోటకూడా అవి నడవటానికి అనుకూలంగా లేవు. మనుషులు నడిచే ఫుట్‌ పాత్‌లు ఉండవలసిన స్థలంలో వాహనాలను పార్కు చేస్తున్నారు. వాహనాలు తిరిగే రోడ్డుమీద మనుషులు నడుస్తున్నారు. ఇదీ మన నగరంలో పరిస్థితి. నగరంలో అక్కడక్కడ ఫుట్‌ పాత్‌లు ఉన్నాయి. కాని అవి చాలావరకు ఆక్రమణలకు గురై ఉన్నాయి. అవి నడవటానికి పనికి వచ్చే పరిస్థితి లేదు. ఫుట్‌ పాత్‌లు నిర్మించిన చోట కూడా, నిర్మించే పధ్దతిలో కూడా లోపం ఉంది. 01. ఫుట్‌పాత్‌లు ఎత్తుగా నిర్మించటంతో వాటిని ఎక్కలేక కొంతమంది రోడ్డుమీదనే నడిచి వెళుతున్నారు. 02. ఫుట్‌పాత్‌ వెడల్పులు కూడా చాలా తక్కువగా ఉంటున్నవి.
పార్కింగ్‌ సౌకర్యాలు:- ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంలో పార్కింగ్‌ చాలా కీలకమైనది. నగరంలో పార్కింగ్‌ సౌకర్యాలు లేవు. పార్కింగ్‌ డిమార్కేషన్లు లేవు. పార్క్‌ హౌస్‌లు లేవు.
ట్రాఫిక్‌ సింబల్స్‌:-అవసరమైన అన్ని రకాల ట్రాఫిక్‌ సింబల్స్‌ లేవు.ఉదాహరణకు స్పిడ్‌ లిమిట్‌ సింబల్స్‌, స్పీడ్‌ లిమిట్‌ ముగింపు సింబల్స్‌, రోడ్‌ ప్రయారిటీ సింబల్స్‌, టర్నింగ్‌లు సూచించేవిధంగా రోడ్డుమీద ముందుగానే సూచించవలసిన సింబల్స్‌ వగైరాలు లేవు. ఉన్న సింబల్స్‌ కూడా ప్రస్ఫుటంగా కనుపించే విధంగా లేవు.
ట్రాఫిక్‌ సిగ్నల్స్‌:-నగరంలో సరైన సిగ్నలింగ్‌ వ్యవస్థలేదు. ఉన్న సిగ్నల్స్‌ కొన్నిసార్లు పని చేస్తే, కొన్నిసార్లు పని చేయవు. పోలీసువారు మాన్యువల్‌గా ట్రాఫిక్‌ కంట్రోలు చేయవలసివస్తున్నది.
రోడ్ల బెతాయింపు:-ట్రాపిక్‌ కోసం తగిన రోడ్ల బెతాయింపు (Road Division) విధానంలేదు. దీనితో అన్ని వాహనాలు రోడ్డు అంతటా తిరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతున్నది. రోడ్ల పైన పోలీస్‌ వారు ఇష్టా రాజ్యంగా బారికేడ్లు పెడుతున్నారు. పాదచారులు రోడ్లు దాటడానికి సరైన విధానం లేదు. అన్ని చోట్లా జీబ్రా మార్కులు లేవు. పాదచారులు రోడ్డు దాటడానికి సిగ్నలింగ్‌ వ్యవస్థలేదు.
వేగపరిమితిపట్ల పొరపాటు అవగాహన(Wrong Notion towards Speed Limit):- నగరంలో వేగపరిమితి గురించి పొరపాటు అవగాహన ఉన్నది. ఉదాహరణకు ఒక రోడ్డులో 40 కి.మీ వేగ పరిమితి ఉంటే 40 కి.మీ.లకు మించి వెళ్లకూడదు తప్ప, 40 కి.మీ.ల లోపు ఇష్టం వచ్చిన వేగంతో ( అంటే 30, 25, 20 కి.మీ.లు వగైరా) వెళ్ళ వచ్చు అనే అవగాహన ఉన్నది. దీనితో 40 కి.మీ వేగంతో వెళ్లే వాహనాలకు దానికి లోపు వేగంతో వెళ్ళే వాహనాలు ఆటంకంగా మారుతున్నాయి. ఫలితంగా 40 కి.మీ వేగంతో వెళ్లే వాహనాలు రోడ్డు మీద ఎటు అవకాశం కనుపిస్తే అటు తప్పుకొని వెళ్ళవలసి వస్తున్నది. ఎటు వీలుంటే అటు తప్పుకొని వెళ్ళటం డ్రైవింగ్‌ రూల్‌కు విరుధ్ధం. ఫలితంగా ట్రాఫిక్‌ అస్థవ్యస్థతంగా మారుతున్నది.
పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ:-నగరంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ అన్ని ప్రాంతాలకు విస్తరించిలేదు. ఫలితంగా సొంత వాహనాలను వాడటం తప్పని సరి అవుతున్నది.
ఔటర్‌ మరియు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్లు:- దేశంలోని రెండు ప్రధాన జాతీయ రహదారులు (16, 65 నెంబర్లు.)నగరం ద్వారావెళ్తున్నాయి. ఈ జాతీయ రహదారుల వలన వచ్చే భారీ వాహనాలుకూడా విజయవాడ నగర ట్రాఫిక్‌ సమస్యకు కారణ మవుతున్నాయి. ఆధునిక వ్యవస్థలలో భారీ వాహనాలను ఔటర్‌ రింగ్‌ రోడ్ల ద్వారా నగరంలోకి రాకుండా మళ్ళిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారుల వెంట ఉన్న చిన్న చిన్న పట్టణాలకు సైతం ఔటర్‌ రింగ్‌ రోడ్లు నిర్మించి భారీ వాహనాల ట్రాఫిక్‌ను పట్టణంలోకి రాకుండా మళ్ళిస్తున్నారు. కాని భారీ వాహనాల ట్రాఫిక్‌ను నగరంలోకి రాకుండా మళ్ళించడానికి విజయవాడకు మాత్రం ఔటర్‌రింగ్‌ రోడ్డు లేదు.
అదేవిధంగా నగరం ఒకచివరనుండి మరో చివరకు వెళ్ళవలసిన ప్రతివాహనము ప్రస్తుతమున్న వీధుల ద్వారానే వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉపయోగపడేది ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు. అలాంటి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు విజయవాడ నగరానికి లేదు.
ఫ్లై ఓవర్‌లు:- విజయవాడ నగరంలో జాతీయ రహదారి 16 పై స్క్యూ బ్రిడ్జినుండి యలమంచిలి కాంప్లెక్స్‌ పరిసర ప్రాంతాల వరకు ఒక ఫ్లై ఓవర్‌ను, అలాగే దుర్గ గుడివద్ద ఒక ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఇవి జాతీయ రహదారుల ద్వారా వచ్చే ట్రాఫిక్‌కు పరిష్కారం లభించవచ్చేమో కాని, నగరంలో అన్ని ప్రాంతాలలో ట్రాపిక్‌ సమస్యకు ఇవి పరిష్కారాన్ని చూపలేవు.
నగరంలో రోడ్లు, ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యల శాశ్విత పరిష్కారంకోసం మున్సిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు తీసుకోవటం లేదని ఈ సమావేశం భావించింది. గత కార్పొరేషన్‌ కౌన్సిల్‌ కాలంలో కార్పొరేటర్లు, అధికారులు ప్రజాధనాన్ని ఖర్చుచేసి విదేశాలు పర్యటించి వచ్చారు. కాని వారు అధ్యయనం చేసిన విషయాలు ఈనగరానికి ఉపయోగపడిన దాఖలాలు లేవు. పైన వివరించిన అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విజయవాడలోని రోడ్లు, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ విధానాలను మీముందుంచుతున్నాము.
పరిష్కారాలురోడ్లు, ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారాన్ని చూపించబోయే ముందు National Urban Transport Policy, 2014
లో ఉన్న అంశాలను మీముందుంచదలుచుకున్నాము.
Para 8.2. Equitable Allocation of Road Space
    8.2.1. At present, road space gets allocated to whichever vehicle occupies it first. The focus is, therefore, the vehicle and not people.
    8.2.2. The Government of India would, therefore, encourage measures that allocate road space on a more equitable basis, with people as its focus.

    8.3. Universal Accessibility 8.3.1. The Constitution of India ensures equality, freedom, justice and dignity to all individuals and implicitly mandates an inclusive society for all including people with reduced mobility. It includes people with different abilities, senior citizens, women, and children, pregnant women, families with small children, people carrying heavy luggage. Universal accessibility is an approach that covers everyone, so that transport services: (1) be used fairly; (2) provide high degree of freedom; (3) be simple; (4) be easy to understand; (5) be safe; (6) shall not require unnecessary bodily strength, and (7) maintain an appropriate space and size that is easy to use. There should be no barriers that might limit any commuter from carrying out his/her daily tasks. ……………This can be done by integrating certain elements with the existing UT infrastructure. These elements would include adequate width of footpath along the roads; tactile plates on the pavement, anti-skid paving at public transit station entry/exit gates; table-top road crossing facilities, ramps & lifts at FOBs, Signage supplemented with Braille & pictograms, pedestrian crossing facilities with lifts; etc. 


National Urban Transport Policy, 2014 లో ఉన్న పై విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని పరిష్కారాలను మీ ముందుంచుతున్నాము.
ఫుట్‌పాత్‌లు-స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లు
01. ముందుగా రోడ్డు మార్జిన్‌లను ఖరారు చేసుకోవాలి. ఎవరిస్థలాన్ని తీసుకోరాదు. మున్సిపల్‌ స్థలం ఎంత ఉందో అంతే తీసుకొని రోడ్డు మార్జిన్‌లను ఖరారు చేయాలి. రోడ్డు మార్జిన్‌ ఓపెన్‌ టు స్కై ఉండాలి.
02. విద్యుత్‌ వైర్లు అన్ని భూగర్భంలో వేయాలి. వీధిలైట్ల స్థంభాలు మినహా, మరే ఇతర విద్యుత్‌ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు రోడ్డు స్థలంలో ఉండరాదు.
03. రోడ్డు మార్జిన్‌ నుండి 5 నుండి 7 అడుగులు ( రోడ్డు వెడల్పునుబట్టి) వెడల్పుగల ఫుట్‌పాత్‌లను నిర్మించాలి. ఫుట్‌పాత్‌ ఎత్తు రోడ్డు వైపు 6 అంగుళాలకు మించరాదు.
స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లను ఎక్కడ నిర్మించాలి?
04. ఇప్పటివరకు స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లను రోడ్డు మార్జిన్‌ వైపు ( వ్యక్తిగత స్థలాలు, బిల్డింగులను ఆనుకొని) నిర్మించటం ఆనవాయితీగా వస్తున్నది. వీటిని నిరంతరం శుభ్రం చేయవలసి వస్తున్నది. అంతేగాకుండా నివాసగృహలనుండి రోడ్డు మీదకు రావటానికి రాంపులు నిర్మిస్తున్నారు. దీనితో స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లను శుభ్రం చేయటం కష్టమవుతున్నది. పైగా కొంతమంది స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లలో చెత్తపోస్తున్నారు. ఫలితంగా స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లలో అపరిశుభ్రంగా తయారవటం, నీరు నిల్వ ఉండి దోమలు చేరటం జరుగుతున్నది. నగరంలో దోమల బెడద విపరీతంగా ఉన్నది. దీనితో ప్రజలు రోగాల బారీన పడుతున్నారు. కార్పొరేషన్‌ దోమల నివారణ కోసం లార్వాలను నశింపచేసే మందులు చల్లటం, యంత్రాల ద్వారా పొగ వ్యాపింపచేయటం లాంటి చర్యలు తీసుకోవలసి వస్తున్నది. దీనితో కార్పొరేషన్‌ అధికంగా ప్రజాధనాన్ని ఖర్చు చేయవలసి వస్తున్నది.
ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే, ఫుట్‌పాత్‌ను ఆనుకొని, పుట్‌పాత్‌ వెంట (రోడ్డువైపు) స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లను నిర్మించాలి. నిర్మించిన స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లను గట్టి సిమెంటు బిళ్లలతో మూసినట్లైతే స్టార్మ్‌వాటర్‌ డ్రైను ఉన్న భాగంకూడా రోడ్డులో భాగంగా మారి పోతుంది. రోడ్డుమీద వర్షపునీరు పోవటానికి అక్కడక్కడ తుప్పుపట్టని ఉక్కుతో చేసిన జాలీలను ఏర్పాటు చేయాలి. దీనితో రోడ్డు మీద వర్షపునీరు నిలవదు. కనుక రోడ్లు త్వరగా చెడిపోవు.

స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లను ఇలా నిర్మించటంవలన కలిగే లాభాలు.A) మూసిఉండటంవలన స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లలో ఎవరూ చెత్త వేయటానికి అవకాశం ఉండదు. దానితో స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లను పదేపదే శుభ్రంచేయవలసిన అవసరం ఉండదు. ఫలితంగా కార్పొరేషన్‌కు శుభ్రం చేయటానికి అయ్యే ఖర్చుతగ్గుతుంది.                              B) ఇంటిలోనుండి వీధులోకి రావటానికి స్టార్మ్‌వాటర్‌ డ్రైన్‌పై ఎవరూ రాంపులు నిర్మించవలసిన అవసరం ఉండదు. భవిష్యత్తులో ఎప్పుడైనా రిపేర్లు లాంటివి చేయాలన్నా, ఎప్పుడైనా శుభ్రం చేయాలన్నా, అక్కడ ఉన్న గృహాలతో సంబంధంలేకుండా, గృహాలలో నివశించేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు. 
C) స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లలో చెత్తా చెదారం పేరుకుపోవటం, నీరు నిల్వ ఉండటం జరగదు. కనుక దోమలకు అవి స్థావరాలుగా ఉండవు. దీనితో కార్పొరేషన్‌కు నిరంతరం లార్వాలను నశింపచేసే మందులు చల్లటం, పొగ యంత్రాలను వాడటం చేయవలసిన అవసరం ఉండదు. కార్పొరేషన్‌కు ఖర్చు బాగా తగ్గుతుంది. ప్రజలు ఆనారోగ్యాల బారీన పడకుండా ఉంటారు. 
D) సాధారణంగా ఇంటి లోని డ్రైనేజి నీరు భూగర్బ డ్రైనేజికి కలిపి ఉంటుంది. ఒక వేళ ఎక్కడైనా వర్షపు నీరు భూగర్బ డ్రైనేజికి కలిపి లేకపోతే ఒక చిన్న పైపుద్వారా ఫుట్‌పాత్‌ క్రిందుగా స్టార్మ్‌వాటర్‌ డ్రైనుకు కలిపితే ఇంటి ఆవరణలోని నీరుకూడా సులభంగా డ్రైనులోకి పోతుంది.
ఐరోపా దేశాలలో ముఖ్యంగా జర్మనీ, స్విర్జర్‌లాండ్‌ లాంటి దేశాలలో స్టార్మ్‌వాటర్‌ డ్రైన్లను ఈ విధంగా నిర్మించటంవలన వారికి సమస్యలు పరిష్కారమయ్యాయి. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము ఆదేశాలలో అధ్యయనం చేసిన అనంతరం ఈ పరిష్కారమార్గాన్ని మీముందుంచుతున్నాము.
పార్కింగ్‌ సౌకర్యాలుఫుట్‌పాత్‌ ప్రక్కన పార్కింగ్‌
ఫుట్‌పాత్‌ ప్రక్కన పార్కింగ్‌ డిమార్కేషన్‌ చేయాలి. ఇప్పటివరకు అనేక ప్రాంతాలలో ఫుట్‌పాత్‌లు లేకుండా రోడ్డు మార్జిన్‌లలో వాహనాలను ఆపుతున్నారు. ఎదురుగా ఉన్న షాపులవారు తమ షాపుముందు ఆపవద్దని అభ్యంతరపెడుతున్నారు. కారణం వాహనాలు తమ షాపుకు అడ్డుగా ఉండటంవలన సరుకు కోసం వచ్చేవారు లోపలికి రాలేక, తమ షాపుకు రాకుండా ప్రక్కషాపుకు పోతారని వారి భావన. అందుకే వారు తమ షాపు ఎదురుగా వాహనాల పార్కింగ్‌కు అభ్యంతరం తెలుపుతున్నారు. అది కొంత నిజంకూడా. తమ వాకిటికి ఎదురుగా దారికోసం బారికేడ్లు పెడుతున్నారు. రోడ్డు మార్జిన్‌లో ఫుట్‌పాత్‌ వేసి, దాని ప్రక్కన పార్కింగ్‌ డిమార్కేషన్‌ చేస్తే. జనం ఫుట్‌పాత్‌ మీదనే నడుస్తారు కాబట్టి ఈ సమస్య పరిష్కారమవుతుంది. అందువలన ఫుట్‌పాత్‌ నిర్మించి దాని ప్రక్కన పార్కింగ్‌ డిమార్కేషన్‌ చేయాలి.
అండర్‌ గ్రౌండ్‌, ఓవర్‌ గ్రౌండ్‌ పార్కుహౌస్‌లు

విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలలో అండర్‌ గ్రౌండ్‌ పార్కుహౌస్‌లు, 2 లేదా 3 అంతస్తులుగల ఓవర్‌ గ్రౌండ్‌ పార్కుహౌస్‌లను నిర్మించవచ్చు. ఓవర్‌ గ్రౌండ్‌ పార్కుహౌస్‌లను కాంక్రిట్‌తోనే నిర్మించాలని లేదు. ఇనుపకమ్మీలతో నిర్మించవచ్చు. ఉదాహరణలు:
వన్‌ టౌన్‌ ఏరియాలో పార్క్‌ హౌస్‌లు 
A) మున్సిపల్‌ ఆఫీసు భవనాలను తొలగించి ఆ స్థలంలో 3 లెవెల్స్‌ గల ఆటోమేటిక్‌ అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ను ఏర్పాటుచేసి ఆ పైన బహుళ అంతస్తుల భవనాలతో మున్సిపల్‌ కార్యాలయాలను నిర్మించవచ్చు దీనివలన వన్‌టౌన్‌ వాసులకు పార్కింగ్‌ సమస్య పరిష్కారమౌతుంది. అదేవిధంగా దుర్గ గుడికి వచ్చే యాత్రికులు ఎదుర్కొంటున్న పార్కింగ్‌ సమస్య పరిష్కారమవుతుంది.

B) కెనాల్‌ రోడ్డులో కాల్వ కట్ట మీద ఓవర్‌ గ్రౌండ్‌ మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ నిర్మించవచ్చు. 
C) గాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌ ముందు ఉన్న ఖాళీ స్థలం, రోడ్డు తొలగించి, క్రింద బహుళ అంతస్తుల అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ నిర్మించి, పైన హైస్కూల్‌ గ్రౌండ్‌ను, రోడ్డును యధాతధంగా ఏర్పాటు చేయవచ్చు. 
D) రైల్వే డిపార్టుమెంట్‌ వారితో మాట్లాడి రైల్వే స్టేషన్‌ ఏరియాలో వన్‌ టౌన్‌, 2 టౌన్‌ ఏరియాలలో బహుళ అంతస్తుల సెల్లార్‌ పార్కింగ్‌లను ఏర్పాటు చేయవచ్చు.
టు టౌన్‌ ఏరియాలో పార్క్‌ హౌస్‌లు
  E) బందరు రోడ్డులో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ స్థలంలో రెండు లేదా 3 అంతస్తుల అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ను నిర్మించి వాటిపై భాగాన పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ను నిర్మించుకోవచ్చు,
  F) పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్‌ స్థలంలో కూడా రెండు లేదా 3 అంతస్తుల అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ను నిర్మించి పైన పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్‌ను యధాతధంగా వాడుకోవచ్చు.
  G) పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌లోని ఖాళీ స్థలాలలో రెండు లేదా 3 అంతస్తుల సెల్లార్‌ పార్కింగ్‌లను నిర్మించి. పై భాగాన బస్‌ స్టాండ్‌ అవసరాలకు వాడుకోవచ్చు.
  H) పాత బస్‌ స్టాండ్‌ స్థలం, పాత గవర్నమెంట్‌ ఆసుపత్రి స్థలాలలో అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ లాట్‌లను ఏర్పాటు చేయవచ్చు. పైన యధావిధిగా వాడుకోవచ్చు.
  I) జైహింద్‌ టాకీస్‌ ఎదురుగా ఉన్న యన్‌.టి.ఆర్‌ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ను, ఏలూరు రోడ్డులో ఉన్న కాంప్లెక్సులను గవర్నమెంట్‌ ప్రెస్‌ స్థలంలోనూ ప్రస్తుతం ఉన్న భవనాలను తొలగించి వాటి స్థానంలో అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ లను ఏర్పాటు చేసి పైన యధాతధంగా నూతన భవనాలను నిర్మించవచ్చు. 
J) సత్యన్నారాయణపురంలోని ఎ.కే.టి.పి.యం పాఠశాల వద్దనున్న మున్సిపల్‌ కార్యాలయం, మీసేవ కార్యాలయాలను తొలగించి క్రింద బహుళ అంతస్తుల అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌లను నిర్మించి, పైన మున్సిపల్‌ కార్యాలయం, మీసేవ కార్యాలయ నూతన భవనాలను విశాలంగా నిర్మించుకోవచ్చు.
 K) అలంకార్‌ సెంటర్‌లోని రైవస్‌ కాల్వగట్టు మీద, అలాగే ఏలూరు కాల్వ కట్టమీద ఓవర్‌ గ్రౌండ్‌ మల్టీ లెవెల్‌ పార్కింగ్‌లను నిర్మించవచ్చు.
 L) పడమట, భవానిపురం, రామవరప్పాడు, సింగ్‌ నగర్‌ తదితర ప్రాంతాలలో కూడా అనేక చోట్ల పార్క్‌ హౌస్‌లను ఏర్పాటు చేయవచ్చు.
 M) అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ లాట్‌లను ఏర్పాటు చేయటానికి తగిన స్థలం లేని ప్రాంతాలలో నిలువు (వర్టికల్‌) పార్కింగ్‌ లాట్‌లను, ఆటోమేటెడ్‌ (యాంత్రిక) పార్కింగ్‌ లాట్‌లను, తక్కువ స్థలంలో ఏర్పాటు చేయవచ్చు.
 N) ప్రైవేటు స్థలాల యజమానులను ప్రోత్సహించి, వారి స్థలాలలో ప్రైవేటు పార్క్‌హౌస్‌లను ఏర్పాటు చేయించవచ్చు.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా అవకాశమున్న ప్రతి చోటా పార్కుహౌస్‌లను నిర్మించవలసి యున్నది. ఇవన్నీ ఒకేసారి జరగవన్నది నిజం. కాని ముందు నిర్మించగలిగిన చోటల్లా ఓవర్‌గ్రౌండ్‌ పార్కుహౌస్‌లను నిర్మించటం, నూతనంగా నిర్మించే ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు పార్కింగ్‌ కేవలం తమ సిబ్బందిని మాత్రమే దృష్టిలోపెట్టుకొని కాకుండా, పబ్లిక్‌ పార్కింగ్‌ను దృష్టిలో పెట్టుకొని వీలైనంత ఎక్కువ 1 లేదా2 అంతస్తుల అండర్‌గ్రౌండ్‌ పార్కుహౌస్‌ను నిర్మించటం, ప్రైవేటు ఖాళీస్తలాలలో పార్కింగ్‌ లాట్‌లను ప్రోత్సహించటం లాంటివి చేయవచ్చు.
ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌ వారితో సంప్రదించి, ఇరిగేషన్‌ పనులకు ఇబ్బంది లేకుండా కాలువలపై ఇనుప కమ్మీలతో ఓవర్‌గ్రౌండ్‌ పార్కుహౌస్‌లను నిర్మించవచ్చు.
ఫుట్‌పాత్‌లమీదగాని, ఫుట్‌పాత్‌ ప్రక్కన పార్కింగ్‌లోకాని, రోడ్డుమీదగాని ఎటువంటి ఆక్రమణలను అనుమతించరాదు.
ఫ్లైఓవర్లు
నగరంలో బెంజిసర్కిల్‌ వద్ద, దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్‌లు నిర్మిస్తున్నారు. అయితే అవి కేవలం జాతీయ రహదారుల ద్వారా వెళ్ళే ట్రాఫిక్‌కు కొంతమేరకు ఉపయోగపడతాయి. అంతేగాని నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి అవి మాత్రమే చాలవు. అందువలన మరికొన్ని ప్లైఓవర్‌ల నిర్మాణాలు చేపట్టవలసియున్నది.
1) చిట్టినగర్‌ కేదారేశ్వరపేటలను కలుపుతూ రైల్వే ట్రాక్‌పై ఉన్న ఓవర్‌ బ్రిడ్జి (ఎర్రకట్ట) పాతదై పోవటంతో బాటుగా ప్రస్తుత ట్రాఫిక్‌కు సరిపోవటంలేదు. ఇది ఒన్‌ టౌన్‌, టూ టౌన్‌ లను కలుపుతూ ఉన్న ప్రధానమైన మార్గంగా ఉన్నది. అందువలన ఈ ఓవర్‌ బ్రిడ్జి స్థానంలో 4 లైన్ల నూతన ఫైఓవర్‌ ను నిర్మించాలి.
2) సింగ్‌నగర్‌ ఫైఓవర్‌ కేవలం 2 లైన్ల ఫైఓవర్‌ కావటంతో ఇరుకుగా ఉండి ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉన్నది. దాని ప్రక్కనే మరో 2 లైన్ల ఫైఓవర్‌ నిర్మించాలి. ఒక వేళ స్థలం చాలకపోతే ఉన్న ఫ్లై ఓవర్‌ తొలగించి నూతనంగా 4 లైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించవచ్చు.
3) గుణదల వద్ద బుడమేరుపై ప్రాంభమైన ఫైఓవర్‌ ను వేంటనే పూర్తిచేయాలి.
4) మధురానగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైల్‌ అండర్‌బ్రిడ్జిని నిర్మించాలి.
ట్రాఫిక్‌ సింబల్స్‌- ట్రాఫిక్‌ సిగ్నల్స్‌
01. నగరంలో ప్రతిరోడ్డులో స్పిడ్‌ లిమిట్‌, స్పిడ్‌ లిమిట్‌ ముగింపు బోర్డులు తప్పనిసరిగా ఉండాలి.
02. ప్రాధాన్యత రోడ్లు సింబల్స్‌, ప్రాధాన్యత కాని రోడ్లనుండి వచ్చే వాహనదారులకు ''ఆగి, చూచి. వెళ్ళుము'' అనే బోర్డులు తప్పని సరిగా ఉండాలి.
03. రోడ్డుమీద 500 మీటర్లు ఆపైననుండే ఫ్రీ లెఫ్ట్‌ సూచించేవిధంగా రోడ్డుపై బాణపుగుర్తులు ఏర్పాటుచేయాలి.
04. నగరంలోని అన్ని జంక్షన్లలో 24 గంటలు పని చేసే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటుచేయాలి. పోలీసువారు మాన్యువల్‌గా ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేసే పధ్ధతికి స్వస్తిచెప్పాలి.
05. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉన్న అన్ని చోట్ల గ్రీన్‌, ఎల్లో, రెడ్‌ మూడు రంగులలో తప్పనిసరిగా ఉండాలి.
06. ట్రాఫిక్‌ సింబల్స్‌కుగాని, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌కుగాని ఏవిధమైన ఆటంకాలు ఉండరాదు. డ్రైవర్లకు ప్రస్ఫుటంగా, స్పష్టంగా కనుపించే విధంగా ఉండాలి.
మాన్‌హోల్స్‌
01.మాన్‌హోల్స్‌ రోడ్డు మట్టానికి ఉండే విధంగా, లీకులు లేకుండా ఆధునిక పధ్దతులలో నిర్మించాలి.
రోడ్ల బెతాయింపు (Road Division)
01. అన్ని వాహనాలు రోడ్డు అంతటా తిరగకుండా ఒక క్రమ పధ్దతిలో వెళ్లాలంటే విజయవాడ నగరంలో రోడ్ల బెతాయింపు కీలకమైనది. ప్రారంభంలో బందరురోడ్డు, ఏలూరురోడ్డు, సాంబమూర్తి రోడ్డు, జి.ఎస్‌.రాజు రోడ్డు, ఐలాపురం ¬టల్‌ రోడ్డు, ఆంధ్రపత్రిక రోడ్డు, కె.టి.రోడ్డు, పండ్ల మార్కెట్‌ -అయోధ్యనగర్‌ -గవర్నమెంట్‌ ప్రెస్‌ రోడ్డు, నేతాజీ రోడ్డు, నూజివీడు రోడ్డు, క్రాంబే రోడ్డు, సితారా రోడ్డులతో బాటుగా నగరంలో ఉన్న జాతీయ రహదారులలో ముందుగా రోడ్ల బెతాయింపు చేయవచ్చు.
02. పాదచారులు రోడ్లు దాటడానికి అన్ని చోట్లా జీబ్రా మార్కులు సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటుచేయాలి.
ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు
01. నగరానికి ఔటర్‌ మరియు ఇన్నర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణానికి కార్పొరేషన్‌ చోరవతీసుకోవాలి

ఈ మెమొరాండంలో నగరంలో రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్‌ సమస్యలు, వాటికి కొన్ని పరిష్కారమార్గాలను పొందుపరచాము. అయితే నగరంలో మెట్రోరైల్‌ వేయాలన్న ప్రతిపాదన నేటికీ ఉన్నది. నగరంలో ఈ సమస్యలను పరిష్కరించకుండా కేవలం మెట్రోరైల్‌ ద్వారానే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంకాదు. నగరం మొత్తంలోని ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఖర్చుచేయవలసిన నిధులను కేవలం మెట్రో రైలు నిర్మాణానికే ఖర్చు చేస్తే నగరానికి ఒరిగేదేమీ లేదు. అందువలన ముందు నగరంలోని రోడ్లు ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారాలకోసం మౌలిక సదుపాయాలను కల్పించవలసిందిగా కోరుతున్నాము.
మీరు అనుమతిస్తే , ఆధునిక పధ్దతులలో మాన్‌¬ల్స్‌ నిర్మాణం, స్టార్మ్‌వాటర్‌ డ్రైన్ల నిర్మాణం, రోడ్ల బెతాయింపు తదితర అంశాలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించగలమని మనవి చేస్తున్నాము.
అభివందనాలతో


(వి.సాంబిరెడ్డి)                            (యం.వి. ఆంజనేయులు)
అధ్యక్షులు                                         కార్యదర్శి

Memorandum Submitted to Sri Botsa Satuyanarayana, Minister for Urban Development

                                                                                                                                     తేదీ:13.09.2019
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ & అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ శాఖామాత్యులు శ్రీ బొత్స సత్యన్నారాయణ గారికి,
ఆర్యా,
విషయం: విజయవాడ నగరం లోని వివిధ అంశాలపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సమర్పిస్తున్న మెమొరాండం.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో మున్సిపల్‌ శాఖా మాత్యులుగా అధికారాన్ని చేపట్టిన మీకు ముందుగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా అభినందనలు తెలియజేస్తున్నాము. విజయవాడ నగరానికి సంబంధించిన 3 ప్రధానమైన అంశాలను మీదృష్టికి తీసుకు వస్తున్నాము.
01.నీటి చార్జీల తగ్గింపు
2014 మున్సిపల్‌ ఎన్నికలకు ముందు సుమారు 4 ఏళ్లపాటు సాగిన స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలో విజయవాడలో మంచినీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను పెంచుతూ తీర్మానం చేశారు. ఇవి 1.4.2013 నుండి అమలులోకి వచ్చాయి. మంచినీటి చార్జీలను పెంచిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నది. పెంచకముందు వ్యక్తిగత గృహాలకు (టాప్‌ కనెక్షన్‌)కుళాయికి నెలకు రు.80లు చొప్పున వసూలు చేసేవారు. అపార్టుమెంట్లకు మీటర్లు ఉన్నాయి. పెంచకముందు నెలకు 3 కిలో లీటర్లకు రు.100/-లు ఆపైన కిలోలీటరుకు రు.8.25లు చొప్పున వసూలు చేసేవారు.
పెంచిన అనంతరం వ్యక్తిగత గృహాలకు ఇచ్చే నీటి చార్జీలకు, ఇంటి పన్నుకు ముడి పెట్టారు. దీనితో వ్యక్తిగత గృహాలకు 40 శాతం నుండి 400 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు 120 శాతంనుండి 400 శాతం వరకు పెరిగాయి. నిజానికి ఇంటిపన్నును బట్టి నీటి వాడకం ఉండదు. ఏ వ్యక్తిగత గృహానికైనా ఇచ్చేది 1/2'' (అరంగుళం) పైపు తోనే నీరు ఇస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నీరు ఇచ్చే కాలపరిమితికూడా ఒకటిగానే ఉంటుంది. నిర్థిష్ట కాలపరిమితిలో అరంగుళం పైపుద్వారా ఒకే పరిమాణం గల నీరు డిశ్చార్జ్‌ అవుతుంది తప్ప, ఇంటి నిర్మాణాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి, పన్నునుబట్టి నీరు రాదు. అందువలన నీటి చార్జీలను ఇంటిపన్నుతో ముడి పెట్టడం అసమంజసమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా భావిస్తున్నాము.
అదేవిధంగా అపార్టుమెంట్లకు ( మీటర్‌ కనెక్షన్‌) శ్లాబు పధ్దతిని ఏర్పాటు చేశారు. అపార్టుమెంట్‌ భవనంలోని ఫ్లాట్ల సంఖ్య పెరిగే కొలది నీటి చార్జీల రేటు పెరుగుతుంది. ఎన్ని ప్లాట్లు ఉన్నా, ప్రతికుటుంబం వాడుకునే నీరు మారదు. అదేనీరు వాడుకుంటున్నప్పటికీ ఫ్లాట్ల సంఖ్య పెరిగే కొలది మీటరు రీడింగ్‌ పై శ్లాబులకు వెళ్ళటంతో నీటి చార్జీలు భారీగా పెరుగుతున్నవి. దీనితో కుటుంబాలపై అదనపు భారం పడుతున్నది. అపార్టుమెంట్‌ బిల్డింగ్‌లో ఫ్లాట్ల సంఖ్య ఎక్కువ అయ్యే కొలది అదనపు నీరు వాడకుండానే కుటుంబంపై భారం పడుతున్నది. ఎక్కువ ఫ్లాట్లు ఉన్న అపార్టు మెంట్‌ బిల్డింగ్‌లో ఉండటం నేరమన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా వ్యక్తిగత గృహాలకు, అపార్టుమెంట్లకు నీరిచ్చే సమయంలో తేడా ఉండదు. కనుక అదనంగా వాడుకునే పరిస్థితి కూడా లేదు.
అంతేకాకుండా నగరంలో ఉన్న ప్రతి అపార్టుమెంట్‌ వారు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసే నీటిని కేవలం త్రాగునీటికే వాడుకుంటారు. ఇతర గృహావసరాలకు పూర్తిగా బోరు బావుల ద్వారా తీసిన నీటిని వాడుకుంటారు. అపార్టుమెంట్లలోని అన్ని ఫ్లాట్ల వారు, వ్యక్తిగత గృహాలవారి మాదిరిగా నీటిని తీసుకుంటే నగరంలో ప్రస్తుతమున్న నీటి సరఫరా చాలదు. నీటిని సరఫరా చేయటం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చాలా కష్టమౌతుంది. అలా వాడుకుంటే ఈ శ్లాబు పధ్ధతి ప్రకారం ప్రతి ఫ్లాటుకు వేల రూపాయలు నీటి చార్జీలకు చెల్లించవలసి వస్తుంది. అందువలన అపార్టుమెంట్లకు శ్లాబు పధ్దతిద్వారా నీటి చార్జీలు వసూలు చేయటం అసంమంజసమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా భావిస్తున్నాము.
దీనితోబాటుగా పెంచిన మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను మరల మరల పెంచే పని లేకుండా ఏటా అటోమాటిక్‌గా 7 శాతం పెరిగే విధంగా కూడా సదరు 2013 స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలోనే తీర్మానం చేశారు. అంటే 1.4.2013 నుండి నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు పెరిగాయి. ఆ పెరిగిన నీటి చార్జీల మీద ఏటా 7 శాతం కాంపౌండింగ్‌ పధ్ధతిలో పెంచుతున్నారు. ఇది కూడా ప్రస్తుతం అమలు జరుగుతున్నది. 1.4.2013న పెంచిన చార్జీల అసలు పెంపుదల మీద 7 శాతం కాంపౌండింగ్‌ పధ్ధతిద్వారా పెంచిన ఈ అదనపు పెరుగుదలే ప్రస్తుతం 40 శాతానికి చేరింది.
నీటి చార్జీలను పాత పధ్దతికి మార్చాలని కోరుతూ ప్రజలు ఎన్ని సార్లు గత ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ చార్జీలను పాత పధ్ధతికి మార్చాలని కౌన్సిల్లో తీర్మానం చేసినప్పటికీ, ఆతీర్మానాలను ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నూతన ప్రభుత్వంగా తమరు ఈ చార్జీలపై పునరాలోచించి, నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను 31.03.2013 నాటి పధ్ధతికి మార్చవలసిందిగా కోరుతున్నాము.

4వ రాష్ట్ర ఆర్ధిక సంఘం (4thSFC)ఏర్పాటునోటిఫికేషన్‌ -టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 4వ రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని (4th SFC)ఏర్పాటు చేస్తూ 16.5.2018న గజెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.ఈ గజెట్‌ నోటిఫికేషన్‌ టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 4Vలో త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్తాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలు విధించటం, లెవీలను, పన్నులను, ఫీజులను పెంచటం ఏవిధంగా చేయాలో సిఫార్సు చేయమని 4th SFCని కోరియున్నారు. టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌లోని ఈ అంశాలను పరిశీలిస్తే త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్థాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి, నాటిి ప్రభుత్వం ముందే నిర్ణయంతీసుకొని దానికి తగిన విధంగా సిఫార్సులు చేయమని 4th SFC ని కోరినట్లుగా ఉన్నది. అంతేతప్ప ఆ వ్యవస్థలను మెరుగుపరచటానికి సిఫార్సులను కోరలేదు. అందువలన ఈ అంశాలను ఆనాడే టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా వ్యతిరేకించాము. మేము వ్యతిరేకించటానికి గల కారణాలను మీదృష్టికి తీసుకు వస్తున్నాము..
భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 11 మరియు 12 ప్రకారం త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లు వగైరాలు స్థానిక సంస్థలు నిర్వహించాలి. నిర్వహించటం అంటే వ్యాపారం చేయటం కాదని మేము అభిప్రాయ పడ్డాము. పైగా ప్రభుత్వాలు కాని, స్థానిక సంస్థలు కాని వాణిజ్య దుకాణాలు కావు. పౌరులు ఆదుకాణాల కస్టమర్లు కాదు. పౌర సౌకర్యాలను కలుగజేయటం కోసం పౌరుల పన్నులతో ఏర్పాటు చేసుకున్న ప్రజా సంస్థలు. ప్రజలు చెల్లించిన పన్నులతో వాటిని నడపవలసియున్నది. మనుషులు ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రమైన త్రాగునీరు, పారిశుధ్యం చాలా కీలకమైనవి. వీటిని వ్యాపారమయం చేయటం దారుణం. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీరు ఇవ్వాలి. మనది ఉష్ణ ప్రదేశం. పైగా అనేక సంప్రదాయాలున్న ప్రదేశం. వీటన్నింటి కోసం ఇంకా ఎక్కువ నీరు అవసరమవుతుంది. 72 సంవత్సరాల స్వతంత్రం అనంతరంకూడా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొలది దూరం వెళ్ళవలసి వస్తున్నది. అనేక పట్ణణాలలో రోజు ఇచ్చే పరిస్థితిలేదు. రెండు మూడు రోజులకొకసారి నీరు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దటానికి ఏంచేయాలో సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, ఉన్న నీటితో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం ప్రజా వ్యతిరేకచర్య. అందుకే దీనిని మేము వ్యతిరేకించాము.
2010 జులై 28 న త్రాగునీరు, పారిశుధ్యం అనేవి మానవ హక్కులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది (Water and Sanitation are  recognised as Human Rights by UNO General Assembly through resolution No 64/292 dated 28th July 2010 ). ఐక్యరాజ్య సమితిలో భారతదేశంకూడా భాగ స్వామిగా ఉన్నది. కాని తాగు నీటిని, పారిశుధ్యాన్ని ప్రజల హక్కుగా చూడకుండా వ్యాపార సరుకుగా చూడటం సరైందికాదని మేము భావిస్తున్నాము. అందుకే వీటిని వ్యాపార సరుకుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాము.
ఈ విషయాలను వివరిస్తూ 06.06.2019న 4th SFC ఛైర్మెన్‌ గారికి ఒక మెమొరాండాన్ని కూడా సమర్పించాము. ఈ విషయాలను కూడా మీదృష్టికి తీసుక రావటం సందర్భోచితంగా ఉంటుందని భావించి మీదృష్టికి తీసుకు వస్తున్నాము.

02. విజయవాడ అవసరాలకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులు
విజయవాడ నగరానికి నీటి సరఫరా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ మీదనే ఆధారపడి యున్నది. అది ఇరిగేషన్‌కు సంబంధించిన రిజర్వాయర్‌. 10 లక్షలపైగా జనాభా ఉన్న ఈ నగరానికి నీటి సరఫరా కోసం ప్రత్యేక రిజర్వాయర్‌ లేదు. వ్యవసాయానికి, నగరంలోని నీటి అవసరాలకు ఈ రిజర్వాయర్‌నుండే నీటిని వాడుకోవాలి. ఇటీవల వేసవిలో ఆ రిజర్వాయర్‌లో నీరు 5 అడుగులకు పడి పోయింది. ఇంకొక్క అడుగు పడిపోయినట్లయితే విజయవాడ నగరం నీటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన వలసి వచ్చేది. ఎప్పుడో విజయవాడ జనాభా లక్షలోపు ఉన్న రోజులలో విజయవాడ నీటి అవసరాలకోసం ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా ఉన్న ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ మీద ఆధారపడటం సమంజసమే. కాని జనాభా 10 లక్షలకు పైగా ఉన్న నేటి పరిస్థితులలో ఈ నగరానికి ఏడాదికి సుమారు 5 టి.యం.సిల నీరు (ఆవిరైపోయే నీటితో సహా) అవసరమవుతుంది. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ నుండి అంతనీటిని తీసుకోవటం సాధ్యపడదు. అందువలన నగరానికి నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా నీటి రిజర్వాయర్లు కావాలి. పెద్ద పులిపాక ప్రాంతంలో చెక్‌ డ్యాం నిర్మించి వరద నీటిని నిల్వ చేయవచ్చు. లేదా వివిధ ప్రాంతాలలో 1 లేదా 2 చెరువులను నిర్మించి కృష్ణానది వరద నీటిని వాటికి తరలించవచ్చు. ఇలాంటి ఏదో ఒక పధ్దతిలో విజయవాడ కోసం ఉపరితల నీటిని 5 టియంసిలు నిల్వ ఉంచే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
03. చెత్త నిర్వహణ
విజయవాడలో చెత్తను నశింపజేసే సమస్య తీవ్రంగా ఉన్నది. నగరంలో చెత్త తొలగింపు కొంతమేరకు బాగానే ఉన్నప్పటికీ ఆ చెత్తను నశింప చేయటానికి కావలసిన ఏర్పాట్లు మాత్రం అవసరమైన మేరకు జరగటంలేదు.నగరమంతటా తొలగించిన చెత్తను సింగ్‌ నగర్‌ ప్రాంతంలో పోస్తున్నారు. ఆ డంపింగ్‌ యార్డు వెదజుల్లుతున్న దుర్వాసన, దుమ్ము ధూళితో అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలవుతుండటంతో తీవ్రమైన ఆందోళనలు చేశారు. అయినా ఆసమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు ముస్తాబాద, సవారిగూడెం గ్రామాల ప్రక్కన పోయాలని కార్పొరేషన్‌ ప్రయత్నిస్తుంటే అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. డంపింగ్‌ యార్డు వెదజల్లే దుర్వాసన, దుమ్ము ధూళి వాటివలన వచ్చే రోగాలు ఎక్కడైనా ఒకటే. అందువలన ఇది పరిష్కారం కాదని భావిస్తున్నాము. అదేవిధంగా తడి చెత్తను అపార్టుమెంట్ల ఆవరణలోనే కుళ్ల బెట్టుకోమని కార్పొరేషన్‌ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది అనారోగ్యం మాత్రమే కాకుండా పరిష్కారంకూడా కాదు. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేయాలి. తడి చెత్తనుండి మెన్యూర్‌ తయారు చేయాలి. ఆ ఎరువును పొలాలకు వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలి. అందు కోసం రైతులను చైతన్య పరచాలి. పొడి చెత్తనుండి విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి. పెల్లెట్లను బొగ్గు వాడే బాయిలర్స్‌ ఉన్న పరిశ్రమలలో, సిమెంట్‌ పరిశ్రమలలో బొగ్గుకు బదులు ఈ పెల్లెట్లు వాడే విధంగా ప్రోత్సహించాలి. ఇవి జరిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రోజుకు 500టన్నులకు పైగా విజయవాడ నగరంలో చెత్త ఏర్పడుతున్నది. ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.
ఈ చెత్తను జనావాసాలకు దూరంగా పోయాలని, నగరానికి ప్రత్యేకంగా చెత్త నుండి విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.
పై మూడు అంశాలలో నీటిచార్జీలను తగ్గించే విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతులలో ఉన్నది. అదే విధంగా నగరానికి ప్రత్యామ్నామ నీటి వనరుల ఏర్పాటు, చెత్త నశింపజేయటానికి కావలసిన యార్డులు, విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీల ఏర్పాటు జరగాలంటే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక్కటే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే ఇది సాధ్యపడగలదు. అందువలన ఈ విషయాలను మీ ముందుంచుతున్నాము.
కోరుతున్న అంశాలు సంక్షిప్తంగా...
01. నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను 31.03.2013 నాటి పధ్ధతికి మార్చాలి.
02. విజయవాడ నగర అవసరాలకోసం ఉపరితల నీటిని 5 టియంసిలు నిల్వ ఉంచే విధంగా ప్రత్యామ్నాయ రిజర్వాయరు ఏర్పాటు చేయాలి.
03. నగరంలో ఏర్పడుతున్న చెత్త నశింపజేయటానికి కావలసిన యార్డులు, విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలి.

అభివందనాలతో

(వి.సాంబిరెడ్డి)                                    (యం.వి. ఆంజనేయులు)
అధ్యక్షులు                                                     కార్యదర్శి